షో టైమ్‌ ఫిక్సయింది

18 Dec, 2018 02:07 IST|Sakshi
ప్రభాస్‌

‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత మళ్లీ డార్లింగ్‌ ప్రభాస్‌ను ఎప్పుడు స్క్రీన్‌పై చూద్దామా అని ఆయన ఫ్యాన్స్‌తో పాటు మొత్తం దేశంలో ఉన్న సినీ అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభాస్‌ను చూసేయొచ్చు అంటోంది యూవీ క్రియేషన్స్‌. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’.శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 300కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందుతోంది.

  వచ్చే ఏడాది ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇట్స్‌ షో టైమ్‌. ‘సాహో’ను 2019 ఆగస్ట్‌ 15న రిలీజ్‌ చేస్తున్నాం’’ అని పేర్కొంది. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బేట్స్‌ ఈ సినిమాకు పని చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, మందిరా బేడీ, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శంకర్‌ ఎహసాన్‌ లాయ్, కెమెరా: మది.

మరిన్ని వార్తలు