మార్పు లేదు!

8 Mar, 2018 04:13 IST|Sakshi

కాదు.. కాదు.. దుబాయ్‌లోనే. లేదు... లేదు.. హైదరాబాద్‌లోనే ఫిక్స్‌. ఇది.. ‘సాహో’ చిత్రంలోని చేజింగ్‌ సీక్వెన్స్‌ గురించి ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న చర్చ. ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్‌ కథానాయిక. ఈ సినిమాలో ఇంటర్నేషనల్‌ థీఫ్‌ నుంచి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా మారే వ్యక్తి క్యారెక్టర్‌లో ప్రభాస్‌ నటిస్తున్నారన్నది తాజా ఖబర్‌. ఇందులో ఎంతో కీలకమైన చేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌కు ఆల్మోస్ట్‌ 10 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారట. ఈ చేజింగ్‌ సీన్స్‌ను దుబాయ్‌లో షూట్‌ చేయాలనుకున్నారు.

హాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ కెన్నీ బెట్స్‌ పర్యవేక్షణలో దర్శకుడు సుజీత్‌ లొకేషన్స్‌ను కూడా సెర్చ్‌ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూట్‌ స్టార్ట్‌ కాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ.. ఈ షెడ్యూల్‌ ఈ నెల ఎండింగ్‌లో దుబాయ్‌లోనే జరుగుతుందని ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్‌ యాక్టర్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌ పేర్కొన్నారు. ‘సాహో’ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నాకు తెలిసి దుబాయ్‌ షెడ్యూల్‌లో చేంజ్‌ ఏమీ లేదు. ఈ మంత్‌ ఎండింగ్‌లో దుబాయ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ కావచ్చు. బుర్జ్‌ ఖలీఫా, అబుదాబిలో ‘సాహో’ టీమ్‌తో వర్క్‌ చేయడానికి ఆసక్తిగా ఎదరుచూస్తున్నాను’’ అని నీల్‌ అన్నారు.

మరిన్ని వార్తలు