ట్రైలర్‌ బాగుంది  – ప్రభాస్‌

24 Apr, 2019 00:01 IST|Sakshi

‘‘నువ్వు తోపురా’ సినిమా ట్రైలర్‌ చాలా బావుంది. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుందని భావిస్తున్నాను. ఈ సినిమాతో సుధాకర్‌ కోమాకులతో పాటు యూనిట్‌ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఆల్‌ ది బెస్ట్‌’’ అని హీరో ప్రభాస్‌ అన్నారు. సుధాకర్‌ కోమాకుల, నిత్యాశెట్టి జంటగా హరినాథ్‌ బాబు.బి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నువ్వు తోపురా’. బేబి జాహ్నవి సమర్పణలో యునైటెడ్‌ ఫిలింస్, ఎస్‌.జె.కె. ప్రొడక్షన్స్‌ (యుఎస్‌ఎ) పతాకాలపై  డి.శ్రీకాంత్‌ నిర్మించిన ఈ సినిమా మే 3న విడుదలవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రభాస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా డి. శ్రీకాంత్‌ మాట్లాడుతూ – ‘‘సూరి అనే హైదరాబాద్‌ కుర్రాడి జీవితానికి సంబంధించిన కథ ఇది.

ఎలాంటి బాధ్యతలు లేకుండా తిరిగే సూరి ఎలా మారాడు? అమెరికా ఎందుకు వెళ్లాడు? అన్నదే కథ. మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసి, యూనిట్‌ను అభినంధించిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్‌. అల్లు అరవింద్, బన్నీ వాసుగార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. నిరోషా, రవివర్మ, శ్రీధరన్, దివ్యా రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాతలు: డా.జేమ్స్‌ వాట్‌ కొమ్ము (యు.ఎస్‌.ఎ), రితేష్‌ కుమార్, కెమెరా: పక్రాష్‌ వేలాయుధన్‌ (యు.ఎస్‌.ఎ), వెంకట్‌ సి.దిలీప్‌ (యు.ఎస్‌.ఎ), సంగీతం: సురేష్‌ బొబ్బిలి, యు.ఎస్‌. లైన్‌ ప్రొడ్యూసర్‌: స్టీఫెన్‌ ఓలెర్‌టెన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: రవివర్మ దంతులూరి, రాజు ఆనందేశాయ్‌.  

మరిన్ని వార్తలు