ఛాయ్వాలా నుంచి మన దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ జీవితం ఎందరికో స్ఫూర్తి. ఆయన సక్సెస్ జర్నీ ‘పీఎమ్ నరేంద్రమోదీ’ పేరుతో వెండితెరకు వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన జీవితాన్ని చూడబోతున్నాం. హిందీ, తెలుగు భాషల్లో సంజయ్ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘మనో విరాగి’, హిందీలో ‘మన్ బైరాగి’ టైటిల్స్ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ, మహావీర్ జైన్ నిర్మాతలు. మంగళవారం (సెప్టెంబరు 17) ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ సినిమా పోస్టర్స్ను ప్రభాస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘‘ప్రత్యేకమైన వ్యక్తిపై ప్రత్యేకమైన నిర్మాతలు తీస్తున్న ఈ ప్రత్యేకమైన సినిమా గురించి ప్రత్యేకమైన రోజున తెలియజేస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రభాస్.