ప్రభుకు సైమశ్రీ అవార్డు

1 Sep, 2013 00:58 IST|Sakshi
ప్రభుకు సైమశ్రీ అవార్డు
సీనియర్ నటుడు ప్రభును సైమశ్రీ అవార్డుతో సత్కరించనున్నారు. దక్షిణ భారత చలన చిత్రోత్సవాలు (సైమా) గత ఏడాది ప్రారంభమయ్యాయి. వీటిని అంగరంగవైభవంగా నిర్వహించారు. మళ్లీ ఈ నెల 12, 13 తేదీల్లో షార్జాలోని ఎక్స్‌పో ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలకు చెందిన హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, గాయనీగాయకులు తదితర 19 శాఖలకు చెందిన ఉత్తమ కళాకారులను ఎంపిక చేసి గౌరవించనున్నారు. ఈ అవార్డులను ఆన్‌లైన్ ద్వారా ప్రేక్షకులు ఎంపిక చేసిన కళాకారులకు అందించనున్నారు.
 
ఈ కార్యక్రమంలో మొదటి రోజున భావితరం అవార్డులను ప్రదానం చేస్తారు. నటి పార్వతి ఓమన్ కుట్టాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. మరుసటి రోజు పాపులర్ అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది. నటుడు ఆర్య, టాలీవుడ్ నటుడు రానా, శ్రీయ, సోనూసుద్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఇదే వేదికపై నూరు వసంతాల సినిమాను పురస్కరించుకుని ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. సీనియర్ నటుడు ప్రభుకు సైమశ్రీ అవార్డుతో సత్కరించనున్నారు. అదే విధంగా దశాబ్దాలకు పైగా హీరోయిన్‌గా రాణిస్తున్న నటి త్రిష, కావ్యా మాధవన్‌లను గౌరవించనున్నారు.
 
>