రామాయణాన్ని తెరకెక్కిస్తా : ప్రభుదేవా

19 Sep, 2015 13:35 IST|Sakshi
రామాయణాన్ని తెరకెక్కిస్తా : ప్రభుదేవా

కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారి ప్రస్తుతం బాలీవుడ్ లో దర్శకుడిగా కొనసాగుతున్న సౌత్ స్టార్ ప్రభుదేవా. డ్యాన్సర్గా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా దర్శకుడిగా మాత్రం ఎక్కువగా యాక్షన్ సినిమాలనే చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో రీమేక్స్ మీదే దృష్టి పెట్టినా, తరువాత సొంత కథలతోనూ వందకోట్ల క్లబ్లో చేరిపోయాడు.

దర్శకుడిగా ఎన్ని విజయాలు సాదించినా ఇప్పటికీ ప్రభుదేవను మంచి డ్యాన్సర్గానే గుర్తిస్తారు అభిమానులు. అందుకే ప్రభు దర్శకుడిగా మారిన దగ్గర నుంచి ఓ డ్యాన్స్ బేస్డ్ మూవీని ఆశిస్తున్నారు. ఇంత వరకు ప్రభుదేవ మాత్రం అభిమానుల కోరికను తీర్చలేకపోయాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తున్న 'సింగ్ ఈజ్ బ్లింగ్' మాత్రం తన గత సినిమాల మాదిరి యాక్షన్ సినిమా కాదని, ఇదో డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ అంటున్నాడు.

అంతేకాదు తనకు రామాయణాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలన్న కోరిక ఉందన్నాడు ప్రభుదేవ. ఇదే కాన్సెప్ట్ తో హాలీవుడ్లో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సీరిస్ను నిర్మించారని, మన దగ్గర అలాంటి సినిమా చేయాలంటే బడ్జెట్ పరమైన సమస్య వస్తుందన్నాడు. నిర్మాత దొరికితే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకువస్తానన్నాడు. అలాగే ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్లతో సినిమా చేయాలనుందంటున్నాడు ప్రభుదేవా.