సూపర్‌స్టార్‌ టైటిల్‌తో ప్రశాంత్‌

17 Oct, 2017 05:42 IST|Sakshi

తమిళసినిమా: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం టైటిల్‌తో చాలా ఫ్రెష్‌గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు స్టైలిష్‌ స్టార్‌ ప్రశాంత్‌. గతంలో రజనీకాంత్‌ నటించిన చిత్రం జానీ విజయాన్ని సాధించింది. అదే టైటిల్‌తో ప్రశాంత్‌ నటిస్తున్న చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. స్టార్‌ మూవీస్‌ పతాకంపై సీనియర్‌ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. నటి సంచితాశెట్టి కథానాయకిగా నటిస్తున్న ఇందులో ప్రముఖ నటుడు ప్రభు కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇంకా ఆనంద్‌రాజ్, అషుతోష్‌రాణా, శాయాజీ షిండే, దేవదర్శిని, కళైరాణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వెట్ట్రిసెల్వన్‌ పరిచయం అవుతున్నారు. షూటింగ్‌ పార్టు పూర్తి చేసుకున్న జానీ చిత్ర వివరాలను తెలియజేయడానికి సోమవారం చిత్ర యూనిట్‌ స్థానిక సేట్‌పేట్‌లోని మలయాళీ క్లబ్‌లో  విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరో ప్రశాంత్‌ మాట్లాడుతూ జానీ చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తెలిపారు. రజనీకాంత్‌ చిత్రంతో కంపేర్‌ చేస్తారు: 

నిర్మాత త్యాగరాజన్‌ మాట్లాడుతూ జానీ చిత్రం హర్రర్‌తో కూడిన భారీ సస్పెన్స్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రభు పాత్ర జానీ చిత్రంలో శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్‌ జానీ చిత్రంతో పోల్చుకుంటారని, అంత స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాలు అదరహో అనే స్థాయిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, హైదరాబాద్, బెంగళూర్‌  ప్రాంతాలలో నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబరులో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు