నవరసాలతో ప్రశ్నిస్తా

24 Mar, 2018 01:15 IST|Sakshi
అక్షిత, మనీష్‌బాబు, బాబీ

‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, టామి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు నవ్వులు పంచిన దర్శకుడు రాజా వన్నెంరెడ్డి. మనీష్‌బాబుని హీరోగా పరిచయం చేస్తూ తాజాగా ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ప్రశ్నిస్తా’. అక్షిత కథానాయిక. బి.శేషుబాబు సమర్పణలో జనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పి.సత్యారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభమైంది. నిర్మాత కిరణ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకుడు బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) క్లాప్‌ ఇచ్చారు.

తొలి సన్నివేశానికి దర్శకుడు బి.గోపాల్‌ గౌరవ దర్శకత్వం వహించారు. సత్యారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని ఇరవై ఏళ్ల కిందట నా స్నేహితుడు రాజా వన్నెంరెడ్డిని కోరా. అది నా బాధ్యత అని చెప్పిన ఆయన ఈరోజు హీరోగా పరిచయం చేస్తున్నారు’’ అన్నారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెనకాలే ఉంటుంది. నా ‘క్షేమంగావెళ్ళి లాభంగారండి’ సినిమా విడుదలైన తర్వాత ఉదయం ఆరుగంటలకే ఎందరి నుంచో ఫోన్లు వచ్చేవి.

సక్సెస్‌ లేనప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే.  నవరసాలతో కూడిన చిత్రమిది. మా గురువు దాసరిగారితో ఓ సినిమా తీద్దామనుకున్నా. ఆయన దేవుని వద్దకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడున్నా నాకు ఆశీర్వాదాలు ఉంటాయి’’ అన్నారు. మనీష్‌బాబు, అక్షిత, సంగీత దర్శకుడు ప్రేమ్, రచయిత రాజేంద్రకుమార్, బి.వి.రెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యోగిరెడ్డి, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సతీష్‌ రెడ్డి, సహ నిర్మాతలు: కె.నారాయణ రెడ్డి, శంకర్‌ రెడ్డి.

మరిన్ని వార్తలు