ఆ నటి ఆత్మకు శాంతి చేకూరదు!

2 Apr, 2018 14:27 IST|Sakshi
టీవీ నటి ప్రత్యూష బెనర్జీ (ఫైల్ ఫొటో)

సాక్షి, ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మకు శాంతి చేకూరదని నటి కామ్య పంజాబీ, నటుడు వికాస్ గుప్తా అన్నారు. ఆమె చనిపోయి రెండేళ్లు పూర్తయినా నిందితులకు శిక్ష పడక పోవడంపై బిగ్ బాస్ 11 ఫైనలిస్ట్ వికాస్, కామ్య పంజాబీ విచారం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, ప్రత్యూష మృతి కేసులో దోషులకు ఇప్పటికైనా శిక్ష పడాలన్నారు. ప్రత్యూష రెండో వర్దంతి సందర్భంగా ఈ నటీనటులు తమ ఆవేదనను షేర్ చేసుకున్నారు. 

మరికొన్ని రోజులైతే ప్రత్యూష ఎవరూ అనే ప్రశ్నలు తలెత్తుతాయని, నిందితులకు శిక్ష పడకముందే ఈ నటిని అందరూ మరిచిపోయే అవకాశం ఉందని వీరు అభిప్రాయపడ్డారు. రెండేళ్లు పూర్తయింది, కానీ ఎలాంటి చర్యలు లేవు. అయినా ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు కామ్య పంజాబీ. నేను ఇష్టపడే ఓ మంచి వ్యక్తిని కోల్పోయాను. ఇప్పటికే రెండుళ్లు గడిచిపోయాయి. ఇంకా రోజులు గడుస్తుంటే అందరూ ప్రత్యూషను మరిచిపోతారేమో. నీ మృతి నాకు జీవితం విలువను నేర్పిందని వికాస్ గుప్తా ట్వీట్ చేశారు. ప్రత్యూష మృతికి కారకులైన వాళ్లను శిక్షించేవరకూ ఆమె ఆత్మకు శాంతి చేకూరదన్నారు.

కాగా, 2016 ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె మృతికి ప్రియుడు రాజ్‌సింగే కారణమని ప్రత్యూష కుటుంబీకులు ఫిర్యాదు చేయగా గతంలో ఓసారి అదుపులోకి ముంబై పోలీసులు విచారణ జరిపారు. రెండేళ్లు గడిచినా సెలబ్రిటీ మృతి కేసులోనే న్యాయం జరగలేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కామ్య పంజాబీ, వికాస్ గుప్తా ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు