సేమ్‌ రిజల్ట్‌ రిపీట్‌ అవుతుంది

9 Mar, 2019 00:47 IST|Sakshi
హరికిషన్, నందితా శ్వేత, సుదర్శన్‌ రెడ్డి, సిద్ధీ ఇద్నానీ, సుమంత్‌ అశ్విన్, సప్తగిరి

– సప్తగిరి

సుమంత్‌ అశ్విన్, సిద్ధీ ఇద్నానీ జంటగా నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమకథాచిత్రమ్‌ 2’. 2013లో వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. హరికిషన్‌ దర్శకత్వంలో ఆర్‌. సుదర్శన్‌రెడ్డి నిర్మించారు. ఆయుష్‌ సహ నిర్మాత. ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను నటుడు సప్తగిరి శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ప్రేమకథాచిత్రమ్‌’ మాకు జీవితాన్ని ప్రసాదించింది. ఆ సినిమా పేరును ఇంకా చెప్పుకుంటున్నాం. అంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

ఫస్ట్‌ పార్ట్‌లో నటించిన నేను ఈ ‘ప్రేమకథాచిత్రమ్‌ 2’ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టోరీ పరంగా నేను అవసరం లేదనే నిర్మాత నన్ను ఈ సినిమాకు పిలవలేదు. పిలిచి ఉంటే వచ్చేవాడిని. సుమంత్‌ కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీగా ఉండిపోతుంది. నిర్మాతకు డబ్బులు రావాలి. సేమ్‌ రిజల్ట్‌ రిపీట్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘భావోద్వేగభరితమైన సన్నివేశాలను హరికిషన్‌ చక్కగా తెరకెక్కించారు. హీరోయిన్ల పాత్రలు ఇతర పాత్రలను డామినేట్‌ చేసేలా ఉన్నాయి’’ అన్నారు సుమంత్‌ అశ్విన్‌. ‘‘కంటెంట్‌ని నమ్మి ఈ సినిమాను నిర్మించాను.

స్క్రిప్ట్‌ పరంగా సప్తగిరి పాత్రకు అవకాశం లేదు. ఇప్పుడు ఆయన హీరో కూడా అయిపోయారు. కెమెరామేన్‌ రాంప్రసాద్‌ మంచి విజువల్స్‌ అందించారు. నందితా సింగిల్‌ టేక్‌ ఆర్టిస్టులా నటించారు. సుమంత్‌ అశ్విన్‌ కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీగా నిలుస్తుంది. ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 6న విడుదల చేస్తున్నాం’’ అన్నారు సుదర్శన్‌రెడ్డి. ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత చాలా హారర్‌ కథలు విన్నాను. ఈ చిత్రానికి సైన్‌ చేసినప్పుడు... మళ్లీ హారరా? అన్నారు నా సన్నిహితులు.

కానీ నా క్యారెక్టర్‌ బాగుంటుంది’’ అన్నారు నందితాశ్వేత. ‘‘ఈ సీక్వెల్‌ ‘ప్రేమకథాచిత్రమ్‌’కు దీటుగా ఉండాలని చాలా కష్టపడి తీశాం. సినిమా హిట్‌ సాధిస్తుంది’’ అన్నారు దర్శకుడు హరికిషన్‌. ‘‘ప్రేమకథాచిత్రమ్‌ 2’ నాకు స్పెషల్‌ మూవీ. ఇది తెలుగులో నా రెండో చిత్రం. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు సిద్ధీ ఇద్నానీ. నిర్మాతలు శ్రీధర్‌ రెడ్డి, ఆయుష్‌ రెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ జేబీ, కెమెరామేన్‌ రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు