‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. రిపీట్ ఆడియన్స్ రావడం వల్ల వసూళ్లు నిలకడగా ఉన్నాయి’’ అన్నారు సుదర్శన్రెడ్డి. సుధీర్బాబు, నందిత జంటగా మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన నిర్మించిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’. జె. ప్రభాకర్రెడ్డి దర్శకుడు. సోమవారంతో ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా సోమవారం సుదర్శన్రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘సినిమా పరిశ్రమతో నాది పద్దెనిమిదేళ్ల అనుబంధం. దాదాపు పదిహేను సినిమాలు పంపిణీ చేశాను. వాటిలో ‘ప్రేమిస్తే’ ఒకటి. ఆ చిత్రాన్ని సురేష్తో కలిసి మారుతి విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ మారుతీతో నా అనుబంధం కొనసాగుతోంది. దర్శకుడిగా తన తొలి సినిమా ‘ఈరోజుల్లో’ లోగో చూసి, బాగుందని చెప్పాను. ఆఫీసుకు రమ్మని ట్రైలర్ చూపించాడు.
అప్పుడు తనతో ఓ సినిమా చేద్దామన్నాను. ‘ప్రేమకథా చిత్రమ్’తో అది నెరవేరింది. రోజు రోజుకీ ఈ చిత్రం వసూళ్లు పెరుగుతున్నాయి. నాకు తెలిసి ‘చిత్రం భళారే విచిత్రం, హనుమాన్ జంక్షన్’ తర్వాత రిపీట్ ఆడియన్స్ రావడం ఈ సినిమాకే జరుగుతోంది. ఈ చిత్రం క్రెడిట్ పూర్తిగా మారుతికే దక్కుతుంది. సుధీర్బాబు, నందిత.. ఇలా టీమ్ అంతా చాలా ఎఫర్ట్ పెట్టారు.
ఈ చిత్రం తమిళ, కన్నడ, హిందీ రీమేక్ హక్కులు ఫ్యాన్సీ రేట్కి అమ్ముడుపోయాయి. మళ్లీ ఇదే యూనిట్తో ‘పెళ్లి కథా చిత్రమ్’ సినిమా అనుకుంటున్నాం. ఇది వర్కింగ్ టైటిల్. ‘ప్రేమకథా చిత్రమ్’కి సీక్వెల్ అని చెప్పొచ్చు’’ అన్నారు.