అథ్లెట్‌గా ఆది పినిశెట్టి

7 May, 2019 09:57 IST|Sakshi

హీరో ఇమేజ్‌కు ఫిక్స్‌ అయిపోకుండా సౌత్‌లో డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో దూసుకుపోతున్న యువ నటుడు ఆది పినిశెట్టి. తాజాగా ఈ విలక్షణ నటుడు ఓ స్పోర్ట్స్ డ్రామాకు సంత‌కం చేశాడు. ఈ చిత్రంతో పృథ్వి ఆదిత్య ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. స్పోర్ట్స్ జోన‌ర్  చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాషల్లో ఒకేసారి రూపొందించ‌నున్నారు.

ఈ సందర్భంగా ద‌ర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ ‘నేను ఈ క‌థ‌ను రాసుకుంటున్నంత సేపూ నా మ‌న‌సులో ఆదిగారే మెదిలారు. ఆయ‌న‌కు క‌థ వినిపించాక‌, ఆయ‌న స‌రే చేస్తాను అని చెప్పగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డానికి ఉత్సాహంగా ఉంది. త‌ప్పకుండా మంచి చిత్రాన్ని అందిస్తాను. అథ్లెటిక్స్‌కు సంబంధించిన క‌థ ఇది.

త‌ను క‌న్న క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి క‌థానాయ‌కుడు చేసిన ప్రయ‌త్నం ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అథ్లెటిక్స్ ప‌ట్ల అంద‌రికీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం’ అని అన్నారు. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయ‌న్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు.  పీఎంఎం ఫిల్మ్స్, జి.మ‌నోజ్‌, జి. శ్రీహ‌ర్ష (క‌ట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్‌) స‌హ నిర్మాత‌లుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు