తమిళసినిమా: దొంగ పెళ్లి చేసుకోను అంటోంది నటి ప్రియాభవానీశంకర్. బుల్లితెర యాంకర్, ఆ తరువాత బుల్లితెర నటి, ఆపై వెండితెర నాయకి అంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్న భామ ఈ బ్యూటీ. మెయ్యాద మాన్ చిత్రం ద్వారా హీరోయిన్గా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ కార్తీతో నటించిన కడైకుట్టిసింగం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ తాను చేసిన పనులన్నీ సంతృప్తి కలిగించినవేనని చెప్పింది. తనకు సంబంధించినంత వరకూ అన్నీ సమానమేనని, ఒకటి చిన్నా, మరొకటి పెద్ద అనే భావన తనకు లేదని చెప్పింది. అన్నింటికీ కారణం ప్రేక్షకులేనని పేర్కొంది. మేయాద మాన్ చిత్రానికి ముందు చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదని, మేయాదమాన్ కథ నచ్చడంతో సక్సెస్ అవుతుందన్న నమ్మకంతోనే అందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది.
ఆ చిత్రంలో తన నటనను విజయ్ ప్రశంసించడం ఎప్పటికీ మరచిపోలేనని అంది. ఊహించని తీయని అనుభూతి అది అని పేర్కొంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాననే ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని చెప్పింది. పెళ్లి ఆలోచన ప్రస్తుతానికి లేదని, తాను టీవీ సీరియల్స్లో నటించడం మానేయడంతో పెళ్లి కోసమే నటించడం లేదనే వదంతులు వచ్చాయని చెప్పింది. నిజంగా పెళ్లి చేసుకుంటే ఊరంతా చాటుతానని, అంతే కానీ దొంగ పెళ్లి మాత్రం చేసుకోనని ప్రియా భవానీశంకర్ అంటోంది. ప్రస్తుతం ఎస్జే.సూర్యతో నటిస్తున్న చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, త్వరలోనే మరికొన్ని చిత్రాల గురించి ప్రకటన వెలుడుతుందని చెప్పింది. అయినా చిత్రాల సంఖ్య తనకు ముఖ్యం కాదని, పదేళ్ల తరువాత చూసినా తన చిత్రాలు ప్రేక్షకులు ముఖం తిప్పుకునే విధంగా ఉండరాదని భావిస్తానని, అదే విధంగా తన తల్లిదండ్రులతో కలిసి చూసే విధంగా ఉండే పాత్రలనే ఎంపిక చేసుకుని నటిస్తానని ప్రియాభవానీ శంకర్ అంటోంది.