వివాదంలో శ్రీదేవి బంగ్లా!

17 Jan, 2019 00:08 IST|Sakshi

కన్ను కొట్టి దేశవ్యాప్తంగా ఫేమస్‌ అయిపోయారు మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇప్పుడు ఆమె ‘శ్రీదేవి బంగ్లా’ అనే సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రశాంత్‌ మమ్‌బ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రశేఖర్‌ ఎస్‌.కె, ఎమ్‌. ఎన్‌. పింప్లీ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్‌లోని విజువల్స్‌ తన భార్య శ్రీదేవి జీవితానికి దగ్గరగా ఉన్నాయని బోనీకపూర్‌ ‘శ్రీదేవి బంగ్లా’ సినిమా నిర్మాతలకు నోటీసులు పంపారు. గతేడాది ఫిబ్రవరిలో శ్రీదేవి మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇక.. ‘శ్రీదేవి బంగ్లా’ వివాదం విషయానికొస్తే.. ‘‘ఈ సినిమా టైటిల్‌లో శ్రీదేవి పేరును వెంటనే మార్చడంతో పాటు వేరే మార్పులు చేయాల్సి ఉంటుందన్న విధంగా బోనీకపూర్‌ మాకు నోటీసులు పంపారు. బయోపిక్‌కు అనుమతులు తీసుకోవాలన్న విషయం తెలుసు. శ్రీదేవి అనే పేరు గల నటి లండన్‌ వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవలసి వచ్చిందనే అంశాల ఆధారంగా మా సినిమా ఉంటుంది. ఇది ఒక క్రైమ్‌ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఇప్పుడు స్టోరీ లైన్‌ గురించి ఇంతకన్నా చెప్పలేం. శ్రీదేవి అనేది కామన్‌ నేమ్‌. రిలీజ్‌ కాకుండానే శ్రీదేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతోందనడం సరికాదు. విడుదలయ్యాక ఇది శ్రీదేవి బయోపిక్‌ అవునా? కాదా? అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఈ సినిమాకి ముందుగా కంగనా రనౌత్‌ని అనుకున్నాం. కానీ సౌత్‌లో మరింత రీచ్‌ ఉండాలని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను తీసుకున్నాం’’ అని పేర్కొన్నారు ప్రశాంత్‌.

‘‘సినిమాలో శ్రీదేవి అనేది నా పాత్ర పేరు. ఆమె పేరుతో ఎవరూ వివాదాలు సృష్టించాలనుకోరు’’ అని ప్రియా ప్రకాశ్‌  పేర్కొన్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు