ఆర్మీ ఆఫీసర్‌ భార్యగా..

27 Apr, 2020 00:33 IST|Sakshi
ప్రియమణి

‘ది ఫ్యామిలీమేన్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించి, డిజిటల్‌ వ్యూయర్స్‌ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు నటి ప్రియమణి. ఇప్పుడు ‘అతీత్‌’ అనే మరో వెబ్‌ సిరీస్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్‌ భార్య జాన్వీగా కనిపించనున్నారు ప్రియమణి. యుద్ధంలో పోరాడిన ఓ ఆర్మీ ఆఫీసర్‌ చనిపోయినట్లు ప్రకటిస్తారు. అయితే పదేళ్ల తర్వాత ఆ ఆర్మీ ఆఫీసర్‌ తన భార్య, కూతురితో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించాలనుకుని వారి వద్దకు వస్తాడు.

అప్పుడు ఆ తల్లీకూతుళ్ల పరిస్థితి ఏంటి? అసలు ఆ ఆర్మీ ఆఫీసర్‌ చనిపోయినట్లు ప్రకటన రావడం వెనక దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ వెబ్‌ సిరీస్‌ సాగుతుందని సమాచారం. ‘‘ఈ వెబ్‌ సిరీస్‌ కొన్ని హార్రర్‌ అంశాలతో కూడుకున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌. ఇందులో నాతో పాటు రాజీవ్‌ ఖండేల్వాల్, సంజయ్‌ సూరి నటిస్తున్నారు. తనూజ్‌ భ్రమర్‌ దర్శకత్వం వహిస్తున్నారు’’ అని పేర్కొన్నారు ప్రియమణి. ‘ది ఫ్యామిలీ మేన్‌’ సెకండ్‌ సీజన్‌లోనూ కనిపించనున్నారట ప్రియమణి. అలాగే ప్రస్తుతం బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌ సరసన ‘మైదాన్‌’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు ప్రియమణి.

ఈ విషయం గురించి ప్రియమణి మాట్లాడుతూ– ‘‘అజయ్‌ సార్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ వారికి నేను కొత్తగా కనిపిస్తాను. 2013లో షారుక్‌ ఖాన్‌ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో ఓ డ్యాన్స్‌ నంబర్‌ చేశాను. ఆ తర్వాత నాకు బాలీవుడ్‌ నుంచి స్పెషల్‌ సాంగ్స్‌ చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను చేయలేదు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో షారుక్‌ కాబట్టే చేశాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో వెంకటేశ్‌ ‘నారప్ప’, రానా ‘విరాటపర్వం’, ‘సిరివెన్నెల’ చిత్రాలతో పాటు కన్నడ, తమిళ భాషల్లో ‘డాక్టర్‌ 56’లో కూడా నటిస్తున్నారు ప్రియమణి. లాక్‌డౌన్‌ వల్ల ఈ చిత్రాల చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడ్డ సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు