ఇండియా నుంచి ఈ ఇద్దరూ..

26 Jun, 2020 03:43 IST|Sakshi
ప్రియాంకా చోప్రా, అనురాగ్‌ కశ్యప్‌

ప్రియాంకా చోప్రా గత ఏడాది సందడి చేసిన వేడుకల్లో టొరొంటో చలన చిత్రోత్సవాలు ఒకటి. ఆమె నటించిన ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. దాంతో ఈ వేడుకకు హాజరై, ఎర్ర తివాచీపై ‘క్యాట్‌ వాక్‌’ చేసి, కనువిందు చేశారు. ఈసారి ప్రియాంక ఈ చిత్రోత్సవాలకు ‘బ్రాండ్‌ అంబాసిడర్‌’. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌లు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం.  

సెప్టెంబర్‌ 10 నుంచి 19 వరకూ... కరోనా వల్ల ఆస్కార్‌ అవార్డు వేడుక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కి వాయిదా పడింది. మేలో ఫ్రాన్స్‌లో జరగాల్సిన కాన్స్‌ చలన చిత్రోత్సవాలు జరగలేదు. అయితే టొరొంటో చలన చిత్రోత్సవాలు మాత్రం ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ వేడుకలు డిజిటల్‌లో స్క్రీనింగ్‌ అవుతాయి. ‘‘ఇవి 45వ టొరొంటో చలన చిత్రోత్సవాలు. ఇన్నేళ్ల టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చరిత్రలో డిజిటల్‌లో ప్రసారం కాబోతున్న తొలి వేడుక ఇదే’’ అని చిత్రోత్సవాల ప్రతినిధులు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా 50 చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించాలనుకుంటున్నామని, సామాజిక దూరాన్ని పాటించే దిశగా సీట్ల ఏర్పాటు ఉంటుందని, అయితే ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యపడుతుందని కూడా తెలిపారు.

మరిన్ని వార్తలు