వైద్య పరీక్షలు..  ప్రేమ పలకరింపులు

10 Oct, 2018 00:23 IST|Sakshi

‘‘సాధారణ వైద్య పరీక్షల కోసం న్యూయార్క్‌ వెళుతున్నా. పని నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నా స్నేహితులను, ఫ్యాన్స్‌ను అనవసరంగా ఏ వార్తనూ ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నా’’ అని ట్వీట్‌ చేసి న్యూయార్క్‌ వెళ్లారు ప్రముఖ నటుడు రిషీ కపూర్‌. అక్కడ కొందరు బాలీవుడ్‌ నటీనటులు ఆయన్ను పలకరిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ఓ టీవీ సిరీస్‌ షూట్‌లో భాగంగా న్యూయార్క్‌లో ఉన్న అనుపమ్‌ ఖేర్‌ ముందుగా రిషీని కలిశారు. ఆ తర్వాత  ప్రియాంకా చోప్రా, సోనాలీ బింద్రే కూడా పలకరించారు.

‘‘ఎప్పటిలానే నవ్వుతూ ఉన్న మీ ఇద్దర్నీ (రిషి, ఆయన భార్య నీతూ) చూస్తుంటే ఆనందంగా ఉంది’’ అని ప్రియాంకా చోప్రా పేర్కొన్నారు. కీమో థెరపీ చేయించుకుంటున్న సోనాలీ తన భర్త గోల్డీ బెహల్‌తో కలసి రిషీని కలిశారు. ఈ విషయం పక్కన పెడితే రిషీ కపూర్‌కు క్యాన్సర్‌ ఫైనల్‌ స్టేజ్‌లో ఉందని, చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్లారంటూ వచ్చిన వార్తలను రిషీ కపూర్‌ సోదరుడు రణ్‌ధీర్‌ కపూర్‌ కొట్టిపారేశారు. ‘‘తను ఏ వ్యాధితో బాధపడుతున్నాడో తనకే సరిగ్గా తెలియదు. మామూలు చెకప్‌ కోసం వెళ్లాడు. వైద్య పరీక్షలను మనశ్శాంతిగా చేసుకోనివ్వండి. ఆ టెస్ట్‌ల ఫలితం ఏదైనా మీకు తప్పకుండా తెలియజేస్తాం’’ అని రణ్‌ధీర్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు