‘ఇతరుల జీవితం గురించి మాట్లాడను’

26 Sep, 2019 16:42 IST|Sakshi

ఇతరుల జీవితం గురించి మాట్లాడే హక్కు తనకు లేదని గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా అన్నారు. ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ తాను జోక్యం చేసుకోనని..తన తమ్ముడు కూడా ఇందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ చోప్రా పెళ్లి ఆగిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలం కిందట తన చిరకాల స్నేహితురాలు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం చేసుకున్న సిద్ధార్థ.. పెళ్లికి కొన్నిరోజుల ముందే ఆమెకు బ్రేకప్‌ చెప్పాడు. దీంతో పెళ్లి ఆగిపోవడానికి సిద్ధార్థ ప్రవర్తనే కారణం అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ప్రస్తుతం అతడు నటి నీలం ఉపాధ్యాయతో డేటింగ్‌ చేస్తున్నట్లు బౌ-టౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కాగా ఇటీవల గణేశ్‌ చతుర్థి సందర్భంగా సిద్ధార్థ నీలంతో కలిసి అంబానీ ఇంట వేడుకలకు హాజరయ్యారు. అదే విధంగా ప్రతీ పార్టీకి నీలంతో కలిసి సందడి చేస్తున్నాడు. ఈ పార్టీలకు ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా హాజరవడంతో రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో.. ఇప్పటికే ఓ అమ్మాయికి ఆశలు కల్పించి వదిలేశారు. మళ్లీ ఇలా చేయడం సరైందేనా అంటూ ప్రియాంక కుటుంబ సభ్యులను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తమ్ముడి వ్యవహారం గురించి ప్రియాంకను ప్రశ్నించగా..‘ ఇతరుల జీవితం గురించి నేను పట్టించుకోను. వేరే వాళ్ల వ్యక్తిగత విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోను. అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు. సిద్దార్థను కలిసినపుడు వాడినే వీటి గురించి అడిగితే బాగుంటుంది’ అని సమాధానమిచ్చారు. కాగా సిద్దార్థ- ఇషితాల నిశ్చితార్థానికి భర్త నిక్‌ జోనస్‌తో సహా ప్రియాంక హాజరైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు