పదేళ్ల తరువాత సల్మాన్‌తో..!

17 Apr, 2018 13:24 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్‌- ప్రియాంక చోప్రా (పాత ఫొటో)

ముంబై : బాలీవుడ్‌ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ సినిమా షూటింగ్‌లతో బిజీగా బిజీగా గడుపుతున్నారు. రెండేళ్లుగా బాలీవుడ్‌ తెరకు దూరమైన పిగ్గీ చాప్స్‌.. సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించనున్నారు.  టైగర్‌ జిందా హై ఫేమ్‌ అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలిపారు. దక్షిణ కొరియా సినిమా ‘ఓదే టూ మై ఫాదర్‌’  స్ఫూర్తితో తెరకెక్కుతోంది ఈ చిత్రం.

మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్‌’ టీమ్‌తో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సల్మాన్‌, అలీలతో మరోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మళ్లీ ఈ సినిమాతో ఆ అవకాశం లభించింది’ అంటూ ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. గతంలో అలీ అబ్బాస్‌ జాఫర్‌ ‘గూండే’, సల్మాన్‌ ఖాన్‌ ‘ముజ్‌ సే షాదీ కరోగీ’  సినిమాలలో ప్రియాంక నటించారు. 2016లో విడుదలైన ‘జై గంగా జల్‌’ సినిమా తర్వాత హాలీవుడ్‌ సినిమాలు, అమెరికన్‌ టీవీ సిరీస్‌ క్వాంటికోతో ప్రియాంక బాలీవుడ్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం సల్మాన్‌ సినిమాకు సైన్‌ చేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు.

‘సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఒక వ్యక్తి, జాతి కలిసి చేసే ప్రయాణం ‘భారత్‌’. ఈద్‌ 2019’ అంటూ దర్శకుడు అలీ అబ్బాస్‌ చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే.. సినిమా కోసం మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు.

మరిన్ని వార్తలు