సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్ స్టార్గా ఎదిగిన ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ సైతం చుక్కలను తాకుతోంది. బాలీవుడ్ సూపర్స్టార్లకు దీటుగా ఆమె పారితోషికం వసూలు చేస్తోంది. అమెరికన్ సిరీస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్టార్గా మారిన ప్రియాంకకు తాజాగా సల్మాన్ సరసన భారత్ మూవీలో నటించేందుకు చిత్ర నిర్మాతలు ఏకంగా 6.5 కోట్లు ముట్టచెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారత్ను సుల్తాన్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ తెరకెక్కిస్తున్నారు.
సల్మాన్, ప్రియాంకతో పాటు మూవీలో దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈద్కు సందడి చేయనున్న ఈ సినిమాను సల్మాన్ బావ మరిది అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్నారు. ఇక అమెరికన్ సింగర్, బాయ్ఫ్రెండ్ నిక్ జోనాస్తో సన్నిహితంగా మెలుగుతున్న ప్రియాంక త్వరలోనే వివాహంతో ఒక్కటి కావాలని వీరు నిర్ణయించుకున్నట్టు సమాచారం.