చక్రి కుటుంబానికి నిర్మాత సాయం

6 May, 2020 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌ డౌన్‌ కారణంగా ఇబ్బందులు  పడుతున్న వివిధ వర్గాల పేదలను ఆదుకునేందుకు  సామాజిక బాధ్యతగా అనేక సంస్థలు సేవలు అందిస్తూ స్ఫూర్తినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కోవిద సహృదయ ఫౌండేషన్‌’ అరుదైన సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, సినీ కాస్ట్యూమ్‌ డిజైనర్,  నిర్మాత డాక్టర్‌  అనూహ్యా రెడ్డి ఆధ్వర్యంలో గత  నెల రోజులుగా నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కోడిగుడ్లు, ప్యాకేజ్‌డ్‌ ఆహారాన్ని పేదలకు అందజేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్‌లు పంపిణీ చేస్తున్నారు. 

ఈ క్రమంలో మంగళవారం దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మోహిత్, వారి తల్లి మణికొండలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలియడంతో వారికి రెండు నెలలకు సరి పడా మందులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా అనుహ్యా రెడ్డి మాట్లాడుతూ.. ‘సాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని మహిత్‌ అన్నారు. కానీ తనకు ఒక పని ఇప్పించాలని కోరారు. దీంతో నేను కరోనాపై ఓ ట్యూన్‌ చేయాలని మహిత్‌ను కోరాను. మహిత్‌ది చాలా మంచి మనసు’ అని తెలిపారు. మహిత్‌ మాట్లాడుతూ.. తన పనిని చూసి ఎంకరేజ్‌ చేయాలని కోరారు. తను ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు చేశానని చెప్పారు. ఓ సోదరిగా అనుహ్యా రెడ్డి ఇచ్చిన భరోసా తన హృదయాన్ని కదిలించిందని తెలిపారు. అలాగే  కృష్ణానగర్‌ , మూసాపేట్‌ ప్రాంతాల్లోని 150 మంది ట్రాన్స్‌ జెండర్లకు అవసరమైన నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం చేశారు.

మరిన్ని వార్తలు