సాక్షి, చెన్నై: సినిమాలో హీరోయిన్ అవకాశం కల్పిస్తానని చెప్పి, నగదు, నగలు తీసుకుని మోసం చేసిన సినీ నిర్మాతను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు. వలసరవాక్కం, వెంకటేశ్వర నగర్, మురుగన్ వీధిలో నివశిస్తున్న మోహన్కుమార్ అనే వ్యక్తి అన్బు మరణం అనే చిత్రం రూపొందిస్తున్నట్లు అందులో కథానాయకిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ముంబయికి చెందిన సౌందర్యరాజన్ భార్య తమిళ సెల్వి(33) నుంచి రూ.5 లక్షల నగదు, రూ.1.20 లక్షల విలువ చేసే నగలను తీసుకుని మోసం చేసినట్లు సమాచారం.
అయితే మోహన్కుమార్ ఎలాంటి సినిమానూ నిర్మించలేదని, తనకు నటిగా అవకాశం కల్పించలేదని, తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదని తమిళ్సెల్వి వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మోహన్కుమార్ను అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు.