సెంచరీ సాధించాలని ఉంది!

26 Feb, 2015 02:36 IST|Sakshi
సెంచరీ సాధించాలని ఉంది!

 ‘‘అగ్ర నిర్మాత రామానాయుడిగారి స్ఫూర్తితో నిర్మాతగా వంద సినిమాలు పూర్తి చేసి, సెంచరీ సాధించాలని ఉంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. ఆయన తాజాగా అనువదించిన ‘పిశాచి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సి. కల్యాణ్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘తమిళనాట ‘పీకే’తో పాటు విడుదలైన ఈ సినిమా అక్కడ విజయ విహారం చేసింది. ప్రముఖ దర్శకుడు బాల ఈ సినిమాను ఎంతో ఇష్టపడ్డారు. ఎక్కడా డబ్బింగ్ సినిమా అనే భావన కలగదు’’ అని తెలిపారు.
 
 తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి సి. కల్యాణ్ వివరిస్తూ -‘‘మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్, మంజుభార్గవి కాంబినేషన్‌లో మా సంస్థలో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మితో మేం చేయనున్న ‘జ్యోతిలక్ష్మి’ షూటింగ్ మార్చి మొదటివారంలో మొదలవుతుంది. సినిమా పరిశ్రమలోని అమ్మాయి అంటే చిన్న చూపు చూసేవారికి     ఈ సినిమా సరైన సమాధానం చెబుతుంది. ఏప్రిల్‌లో వరుణ్‌తేజ్‌తో సినిమా ఉంటుంది. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన తమిళ ‘మయూరి’ని తెలుగులో నేనే విడుదల చేస్తున్నా’’ అన్నారు.