అన్ని సమస్యలూ  ఎదుర్కొన్నా

13 Mar, 2019 01:21 IST|Sakshi

‘‘ఒక కొత్త నిర్మాత ఎదుర్కొన్న అన్ని సమస్యలను నేనూ ఎదుర్కొన్నాను. వీటన్నింటినీ ఒక లెర్నింగ్‌ ప్రాసెస్‌గా భావించాను. అందరికీ వినోదం కావాలి. కానీ చాలామందికి సినిమాలంటే చిన్నచూపు’’  అన్నారు నిర్మాత ఎం. శ్రీధర్‌ రెడ్డి. రామ్‌ కార్తీక్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో కిశోర్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్‌ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మాది అనంతపురం. ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా వర్క్‌ చేశాను. సినిమాలపై ఆసక్తితో నిర్మాణరంగంలోకి వచ్చాను.

చిన్నతనం నుంచే నిర్మాణరంగంపై ఆసక్తి ఉంది. ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు గారు నాకు ప్రేరణ. సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ కూడా చేశా. లాభ నష్టాలను చూశాను. ఈ అనుభవంతో ఒక సినిమాను నిర్మించాలనుకుని ఈ సినిమా చేశాను. ముందు మూడున్నర కోట్ల బడ్జెట్‌ అనుకున్నాం. కానీ దాదాపు ఆరుకోట్లు అయ్యింది. అయితే అవుట్‌పుట్‌ బాగా వచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రాయ్‌ లక్ష్మీకి మంచి క్రేజ్‌ ఉంది. అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్‌ కనెక్ట్‌ అయ్యేలా మంచి ఎమోషన్‌ కూడా ఉంది. టీమ్‌ అందరూ బాగా సహకరించారు. హీరో హీరోయిన్లు బాగా నటించారు. మధునందన్, ప్రవీణ్‌ల పాత్రలు నవ్విస్తాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్‌ కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు శ్రీధర్‌ రెడ్డి. 

మరిన్ని వార్తలు