త్రిషకు వార్నింగ్‌

23 Feb, 2020 08:11 IST|Sakshi

నటి త్రిషకు నిర్మాతలమండలి హెచ్చరికలు జారీ చేసింది. 24 హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై దర్శక నిర్మాత తిరుజ్ఞానం తెరకెక్కించిన చిత్రం పరమపదం విళైయాట్టు. త్రిష సెంట్రిక్‌ కథా పాత్రలో నటించిన ఈ చిత్రానికి అమ్రీష్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర ప్రీ ప్రమోషన్‌ కార్యక్రమం శనివారం ఉదయం చెన్నైలోని సత్యం థియేటర్‌లో చిత్ర యూనిట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో దర్శక నటుడు కే.భాగ్యరాజ్‌, నిర్మాతలమండలి నిర్వాహకుడు టి.శివ, నిర్మాత కే.రాజన్‌ పాల్గొన్నారు.

చిత్ర సంగీతదర్శకుడు అమ్రీష్‌ మాట్లాడుతూ ఇది తనకు 8వ చిత్రం త్రిషకు 60వ చిత్రం కావడం సంతోషంగా ఉందన్నారు. దర్శక, నిర్మాత తిరుజ్ఞానం ఈ చిత్రంలో ఒక్క పాట మాత్రమే ఉంటుందని చెప్పారన్నారు. అది మొట్ట శివ కెట్ట శివ చిత్రంలోని హరహర మహాదేవ పాట మాదిరిగా ఉండాలని కోరారన్నారు.అదే మాదిరి ఈ చిత్రంలోని పాట హిట్‌ అయ్యిందని చెప్పారు. ఇందులో నటించిన విజయ్‌వర్మ మాట్లాడుతూ పరమపదం విళైయాట్టు చిత్రాన్ని అందరి వద్దకు తీసుకెళ్లాలని కోరారు. అనంతరం నిర్మాత సురేశ్‌కామాక్షి మాట్లాడుతూ 15 రోజుల క్రితం ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా తిరుజ్ఞానం తనను పిలిచారన్నారు. చిత్రం చూసిన తరువాత 20 చిత్రాల అనుభవం కలిగిన దర్శకుడు తీసిన చిత్రంగా అనిపించిందన్నారు. బేబీ మానస్వి చాలా చక్కగా నటించిందని ప్రశంసించారు.  చదవండి: సగం పారితోషికం ఇచ్చేయాలి

ఈ చిన్నారి నటుడు కొట్టాచ్చి కూతురన్నది తరువాతనే తెలిసిందన్నారు. సంగీతదర్శకుడు అమ్రీష్‌ సంగీతం చాలా బాగుందన్నారు. కాగా హీరోయిన్ల తాము నటించిన చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదే తెలియడం లేదన్నారు. ప్రముఖ నటులు రజనీకాంత్, విజయ్, కమలహాసన్‌ వంటి వారే తాము నటించిన చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలకు వస్తున్నప్పుడు హీరోయిన్లు ఎందుకు రావడం లేదో తెలియడం లేదన్నారు. అలాంటి వారితో సినిమాలను చేస్తే మంచి ప్రచారం లభిస్తుందనే వారిని ఎంపిక చేస్తున్నామని, లేకుంటే కొత్తవారికే అవకాశాలు ఇచ్చి చిత్రాలు చేస్తామని అన్నారు. చదవండి: మాళవిక మోహన్‌కు సూపర్‌ ఆఫర్‌ 

నిర్మాతలమండలి నిర్వాహకుడు, నిర్మాత శివ మాట్లాడుతూ తాను ఈ చిత్రాన్ని ఇంకా చూడలేదని, అయితే మిత్రులు చిత్రం బాగా వచ్చిందని చెప్పారని అన్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌కు నటి త్రిష రాకపోవడం బాధాకరంగా పేర్కొన్నారు. చిత్రం ఈ నెల 28న విడుదల కానుందని, ఈలోగా ఆమె చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని అల్టిమేట్‌ జారీ చేశారు. లేదంటే ఆమె తీసుకున్న పారితోషికంలో సగ భాగాన్ని నిర్మాతకు తిరిగివ్వాల్సి ఉంటుందని నిర్మాతల సంఘం తరఫున హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు