బాధలో ఉంటే విమర్శలా?

2 May, 2019 03:15 IST|Sakshi

‘నిత్యామీనన్‌ బాగా యాటిట్యూడ్‌ చూపిస్తోంది. పెద్ద ఈగోయిస్ట్‌. త్వరలోనే ఇండస్ట్రీలో నుంచి తనను బ్యాన్‌ చేయాలనుకుంటున్నాం’ అంటూ కొందరు మలయాళ నిర్మాతలు నిత్యామీనన్‌ గురించి విమర్శనాస్త్రాలు సంధించారు. నిర్మాతలు నిత్యపై ఎందుకు ఆగ్రహానికి గురయ్యారు? కారణం ఏంటి? అంటే..  టి. రాజీవ్‌ కుమార్‌ రూపొందిస్తున్న మలయాళ చిత్రం ‘తత్సమయం ఒరు పెన్‌కుట్టి’లో నిత్యామీనన్‌ నటిస్తున్నారు. ఈ షూటింగ్‌లో ఆమె చిత్రబృందాన్ని ఇబ్బంది పెట్టారని, అలాగే కలవడానికి వచ్చిన నిర్మాతలను కలవలేదని సదరు నిర్మాతలు ఆరోపించారు. దాంతో ఆ నిర్మాతలు నిత్యను బ్యాన్‌ చేయాలని, అహంభావి అని కామెంట్స్‌ చేశారట.

ఈ వివాదం గురించి నిత్యామీనన్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందిస్తూ – ‘‘ఈ సంఘటన జరిగినప్పుడు (నిర్మాతలను కలవడానికి నిరాకరించినప్పుడు) మా అమ్మగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారనే విషయం తెలిసింది. థర్డ్‌ స్టేజ్‌. షూటింగ్‌ సమయాల్లో కూడా క్యారవ్యాన్‌లో కూర్చుని ఏడ్చేదాన్ని.  అప్పుడే నాకు మైగ్రేన్‌ కూడా అటాక్‌ అయింది. ఆ టైమ్‌లో నేను వాళ్లను  కలసి మాట్లాడే పరిస్థితిలో లేను. అందుకే నన్ను ఈగోయిస్ట్‌ అని, యాటిట్యూడ్‌ చూపిస్తున్నానని అనుకొని ఉండొచ్చు. ఇలాంటి వాటిని పట్టించుకుని నా సమయాన్ని వృథా చేసుకోను. దానికి బదులు నా వర్క్‌ మీద ఇంకా ఎక్కువ ఫోకస్‌ పెట్టి పని చేస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్యామీనన్‌ ‘జయలలిత’ బయోపిక్, ‘అమేజాన్‌ బ్రీత్‌’ వెబ్‌ సిరీస్, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపిస్తారని టాక్‌.

మరిన్ని వార్తలు