నటి ఫ్యామిలీలో ఆస్తి కోసం డిష్యూం డిష్యూం

17 Aug, 2014 09:53 IST|Sakshi
నటి ఫ్యామిలీలో ఆస్తి కోసం డిష్యూం డిష్యూం

చెన్నై : నటి మనోరమ ఆస్తి వ్యవహారం కుటుంబసభ్యుల మధ్య కలకలం రేపుతోంది. వేయికి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రఖ్యాత నటి మనోరమ. అలాంటి మనోరమపై ఆమె మనవరాలు అభిరామి (25) చెన్నై సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలుచేశారు. అందులో నటి బామ్మ మనోరమ ప్రఖ్యాత నటి అని, ఆమెకు చెన్నై తిరువళ్లూరు ప్రాంతాల్లో  కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తులున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం తన బామ్మ ఆరోగ్యం క్షీణించిందని పేర్కొన్నారు. తన చుట్టూ ఏమి జరుగుతోందో తెలియని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తన తండ్రి భూపతి మందుకు బానిసై మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

ప్రస్తుతం ఆయన స్థానిక టీనగర్‌లో ఉన్న ఇంటిలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. వీరి అనారోగ్య పరిస్థితిని సాకుగా తీసుకుని తన సోదరుడు డాక్టర్ రాజరాజన్ తన బామ్మ ఆస్తులను తన పేరుకు మార్చుకున్నారని పేర్కొన్నారు. తన బామ్మ సొత్తులో తనకు సమభాగం చెందాలని తెలిపారు. అలాంటిది రాజరాజన్ ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారని తాను అలాంటి చర్యలకు పాల్పడితే తనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ శనివారం న్యాయమూర్తి లక్ష్మీకాంతన్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై నటి మనోరమ కొడుకు భూపతి ఆయన భార్య ధనలక్ష్మి, కొడుకు రాజరాజన్ ఈ నెల 22వ తేదీ లోపు బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా నోటీసులు జారీ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.