'పీకే'పై ఆందోళన, థియేటర్లపై రాళ్లదాడి

29 Dec, 2014 14:30 IST|Sakshi
'పీకే'పై ఆందోళన, థియేటర్లపై రాళ్లదాడి

న్యూఢిల్లీ : ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీకే సినిమాపై ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. భోపాల్, అహ్మదాబాద్లోని "పీకే' సినిమా ఆడుతున్న పలు థియేటర్లను వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడించారు. ఓ మతాన్ని కించపరచారంటూ వారు...సినిమా థియేటర్లపై రాళ్లదాడి చేశారు. ఈ సంఘటనల్లో థియేటర్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా 'పీకే'పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ  పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్‌రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. మరోవైపు ఈ చిత్రంపై వివాదం రేగినా అందులోని సన్నివేశాలను తొలగించేందుకు మాత్రం సెన్సార్ బోర్డు నిరాకరించింది.