ఆస్తులు అమ్ముకున్నా! – రాజశేఖర్‌

29 Oct, 2017 01:12 IST|Sakshi

‘‘గరుడవేగ’కి కోటేశ్వర్‌ రాజు, జీవిత, ప్రవీణ్‌ సత్తారు, మా నాన్నగారు నాలుగు పిల్లర్లు. నా పిల్లలు శివాని, శివాత్మికలు సూపర్‌ పవర్స్‌లా మరో రెండు పిల్లర్స్‌లా సహకారం అందించారు’’ అన్నారు రాజశేఖర్‌. ఆయన హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో జ్యో స్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై కోటేశ్వర్‌ రాజు నిర్మించిన సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’. పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్‌ ముఖ్య తారలు. నవంబర్‌ 3న సినిమా విడులవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్‌ వేడుక నిర్వహించారు. రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్‌ చూసిన మా అమ్మగారు హ్యాపీ ఫీలయ్యారు. తను చనిపోవడంతో నేను కింద పడిపోయినట్లు అనిపించింది. మేం సినిమాల్లో ఉండటం కారణంగా చాలా ఆస్తులు అమ్మేశా. దాంతో నష్టపోయాను. ఆ విషయంలో అమ్మగారు బాధపడుతుండేవారు. ఈ సినిమా సక్సెస్‌తో నేను బాగానే ఉన్నానని పై లోకంలో ఉన్న మా అమ్మ తెలియాలి. ఇందుకు ప్రేక్షకుల ఆశీర్వాదం కావాలి’’ అన్నారు. జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘మా అమ్మాయి పేరు మీదనే జ్యో స్టార్‌ బేనర్‌ స్టార్ట్‌ చేశాం. మా మావయ్యగారి ద్వారా కోటేశ్వర్‌ రాజుగారు పరిచయం. రాజశేఖర్‌గారికి మంచి హిట్‌ ఇవ్వాలనే తపనతో ఖర్చుకు వెనకాడకుండా 30 కోట్లతో సినిమా నిర్మించారు. సినిమాకి ఫైనాన్షియల్‌ సమస్యలున్నాయని, నవంబర్‌ 3న రాదని కొందరు అంటున్నారు. అవన్నీ పుకార్లే. 3నే విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. జీవితగారు అందించిన సహకారం మరచిపోలేను. నిర్మాత రాజీ పడలేదు’’ అన్నారు ప్రవీణ్‌ సత్తారు. ‘‘ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు కోటేశ్వర్‌ రాజు. నటీనటులు పూజా కుమార్, శ్రద్ధా దాస్, సన్నీ లియోన్, ఆదిత్‌ అరుణ్‌ తదితర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు