మహారాణిలాగే చూసుకున్నారు

22 Sep, 2015 15:07 IST|Sakshi
మహారాణిలాగే చూసుకున్నారు

కొద్ది రోజులుగా 'పులి' టీం పై శ్రీదేవి గుర్రుగా ఉందంటూ వస్తున్న వార్తలకు ఆమె ముగింపు పలికింది. దాదాపు 30 ఏళ్ల తరువాత పులి సినిమాతో కోలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి, ఆ యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించింది. 1986లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'నాన్ ఇదిమయ్ ఇలయ్' సినిమాలో చివరి సారిగా నటించిన శ్రీదేవి, ఇన్నేళ్ల తరువాత పులి సినిమాలో ఓ కీలక పాత్రలోనటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను పులి టీం.. రాణీ లాగే చూసుకున్నారని తెలిపింది.

పులి సినిమా కోసం చెన్నై స్టూడియోలలో షూటింగ్ చేయటంతో తన కెరీర్ తొలినాళ్లలోని చాలా విషయాలు మళ్లీ గుర్తు చేసుకోగలిగే అవకాశం వచ్చిందని తెలిపింది. ఈ సినిమాలో తనది ప్రస్తుతం వార్తల్లో వస్తున్న తరహా పాత్ర కాదన్న ఆమె...తన పాత్ర గురించి ఇప్పుడే ఏం చెప్పాలేనంది. అలాగే ఈ సినిమాలో తాను చేసిన పాత్ర కోసం కూడా చాలా కేర్ తీసుకుంది శ్రీదేవి. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్ తో పులి సినిమాలో చాలా గ్రాండ్గా కనిపించింది.

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు చింబుదేవన్ దర్శకుడు. శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటించగా, ప్రభు, సుధీప్లు ఇతర కీలక పాత్రల్లోనటించారు. వందకోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో సౌత్ సినిమా స్థాయి మరింత పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాలు.