మహేష్ను మోసం చేసిన దర్శకులు!

24 May, 2016 10:33 IST|Sakshi
మహేష్ను మోసం చేసిన దర్శకులు!

ఫిలిం ఇండస్ట్రీలో ఒక్క హిట్ ఇచ్చిన కాంబినేషన్లో మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. స్టార్ హీరోలు కూడా సక్సెస్ ఇచ్చిన దర్శకులతో కలిసి పనిచేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో తనకు ఒక హిట్ సినిమా ఇచ్చిన దర్శకులకు సెకండ్ చాన్స్ ఇచ్చి చూశాడు. కానీ మహేష్ సెకండ్ చాన్స్ ఇచ్చిన దర్శకులందరూ నెగెటివ్ రిజల్ట్తో మహేష్కు షాక్ ఇచ్చారు.

ఒక్కడు సినిమాతో మహేష్కు స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన దర్శకుడు గుణశేఖర్. అదే కృతజ్ఞతతో తరువాత అర్జున్, సైనికుడు సినిమాలు గుణ డైరెక్షన్లో  చేశాడు మహేష్. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మహేష్ కెరీర్లో మరో మెమరబుల్ మూవీ అతడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ రావటంతో అదే కాంబినేషన్లో ఖలేజా సినిమా చేశాడు, ఆ సినిమా డిజాస్టర్ టాక్తో నిరాశ పరిచింది.

రీసెంట్గా శ్రీను వైట్ల కూడా ఇలాంటి అనుభవాన్నే మిగిల్చాడు. దూకుడు సినిమాతో మహేష్ కెరీర్కు మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీను, తరువాత ఆగడు సినిమాతో అదే స్థాయి ఫ్లాప్ ఇచ్చాడు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల విషయంలో కూడా అదే నిజమైంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి కూల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు బ్రహ్మోత్సవం సినిమాతో నిరాశపరిచాడు.

అయితే ఈ సెంటిమెంట్ను బ్రేక్ చేసిన ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాథ్. మహేష్తో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన పూరి, తరువాత బిజినెస్మేన్ సినిమాతో మరో హిట్ అందించాడు.

>