డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఆగలేదు

24 Jun, 2020 00:26 IST|Sakshi

‘‘జనగణమన’ సినిమా నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌’’ అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్‌. ‘పోకిరి’ (2006), ‘బిజినెస్‌మేన్‌’ (2012) చిత్రాల తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ‘జనగణమన’ అనే చిత్రం రూపొందనుందని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రాన్ని స్వయంగా పూరీయే ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనే టాక్‌ వినిపించింది. ‘‘జనగణమన’ చిత్రం ఆగిపోలేదు. ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌’’ అని తాజాగా పూరి జగన్నాథ్‌ పేర్కొనడంతో ఈ చిత్రం గురించి మళ్లీ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో ఈ సినిమా స్క్రిప్ట్‌పై పూరి దృష్టి సారించారని సమాచారం. అలాగే ‘జనగణమన’ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని ఆయన ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. ఓ సైనికుడి బ్యాక్‌డ్రాప్‌లో ‘జనగణమన’ కథనం ఉంటుందట. మరి... ముందు ప్రకటించినట్లు ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తారా? లేక వేరే హీరో ఎవరైనా నటిస్తారా? వెయిట్‌ అండ్‌ సీ. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం విజయ్‌ దేవర కొండ హీరోగా నటిస్తోన్న ‘ఫైటర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు పూరి జగన్నాథ్‌.   

మరిన్ని వార్తలు