ఆటపాటల పుష్ప

16 Jun, 2020 06:20 IST|Sakshi

‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్‌–దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్ప అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్‌. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌ పాల్గొనలేదు. రెండో షెడ్యూల్‌ నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో చిత్రీకరణలు ఆగిపోయాయి.

తాజాగా టీవీ, సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడంతో మళ్లీ షూటింగ్‌లు మొదలయ్యాయి. ఈ క్రమంలో రెగ్యులర్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేయాలనుకుంటోందట ‘పుష్ప’ టీమ్‌. ప్రస్తుత పరిస్థితుల్లో 40 మందితోనే షూటింగ్‌ చేసుకోవాలనే నిబంధనలున్నాయి. దీంతో ఔట్‌డోర్‌ షూటింగ్‌ కష్టమని భావించిన సుకుమార్‌ ముందుగా ఇన్‌డోర్‌ సన్నివేశాలు చిత్రీకరించాలనుకుంటున్నారట. అందులో భాగంగా ముందు పాటలను చిత్రీకరించేందుకు ప్లాన్‌ చేశారట. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే ట్యూన్స్‌ సిద్ధం చేసి ఉండటంతో తొలుత పాటల చిత్రీకరణ పూర్తి చేయనున్నారని టాక్‌.

మరిన్ని వార్తలు