ముందే బాహుబలి-2 చూడనున్న బ్రిటన్‌రాణి!

2 Mar, 2017 14:56 IST|Sakshi
ముందే బాహుబలి-2 చూడనున్న బ్రిటన్‌రాణి!

హైదరాబాద్‌: విడుదలకు ముందే బాహుబలి-2 గొప్ప ఖ్యాతిని దక్కించుకోనుంది. ఈ చిత్రాన్ని బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌ వీక్షించనున్నారు. అది కూడా మనందరికంటే ముందుగా.. ఆ చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసిన విడుదల తేది ఏప్రిల్‌ 28కంటే ఒక రోజు ముందుగానే అంటే ఏప్రిల్‌ 27నే ఆమె ఈ సినిమాను చూసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో బ్రిటన్‌-భారత్‌ల మధ్య కొన్ని కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగాంగా బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భారతీయ చిత్రాలను ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు ప్రదర్శించనుంది.

అందులో బాహుబలి: ది కన్‌క్లూజన్‌ కూడా చేర్చారట. వాస్తవానికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 28న విడుదల కానుంది. అయితే, ఏప్రిల్‌ 27నే ఈ చిత్రాన్ని ప్రీమియర్‌ షోగా అక్కడ ప్రదర్శించనున్నారంట. ఆ రోజు ఈ చిత్రాన్ని బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్‌తోపాటు ప్రధాని నరేంద్రమోదీ కూడా వీక్షిస్తారని ఓ మీడియా వర్గాల సమాచారం. అయితే, చిత్ర నిర్మాణ వ్యక్తులు, సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ వార్తను ఖండించడంగానీ, అంగీకరించడంగానీ జరగలేదు. చిత్ర విడుదలకు ముందే దాదాపు రూ.500 కోట్ల బిజినెస్‌ను బాహుబలి-2చేసినట్లు చిత్ర వర్గాల అంచనా. తొలి పార్ట్‌ కంటే గొప్పగా ఈ చిత్రం ఉండబోతుందని ఇప్పటికే టాలీవుడ్‌లో విస్తృత ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

>