ప్రేమ, యాక్షన్లతో పక్కా కమర్షియల్..

29 Jun, 2017 21:14 IST|Sakshi
ప్రేమ, యాక్షన్లతో పక్కా కమర్షియల్..
 
నటుడు సందీప్‌ కిషన్, రెజీనా జంటగా నటించిన తెలుగు చిత్రం రారా కృష్ణయ్య ఇప్పుడు తమిళంలో రానుంది. మానగరం చిత్రంతో హిట్‌ జంటగా గుర్తింపు పొందిన సందీప్‌కిషన్, రెజీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి తమిళంలో మహేంద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. జగపతిబాబు, తణికెళ్ల భరణి, కావేరి, రవిబాబు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి మహేశ్‌బాబు దర్శకుడు. సాయిరామ్‌ ఛాయాగ్రహణం, అనురాజామణి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని తమిళంలోకి హైమావతి జాంబమూర్తి సమర్పణలో వీవీఎస్‌.క్రియేషన్స్‌ పతాకంపై ఎన్‌.రాయ్‌రామ్‌ అనువదిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ఎస్.రాజేశ్, రాజశ్రీ, మణికంఠన్, ఎస్‌.రాయ్‌రామ్‌లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఒక దుష్ట కుటుంబంలో పుట్టిన యువకుడు చిన్నతనం నుంచి మంచివాడిగా పెరుగుతాడని అన్నారు. తమ బాటలోకి తీసుకురావడానికి ఆ కుటుంబం ప్రయత్నిస్తోంది. వారిని మంచి మార్గంలో పయనింపజేయడానికి ఆ యువకుడు ప్రయత్నాం చేస్తాడని తెలిపారు. వారిలో ఎవరి ప్రయత్నం ఫలించింది ? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మహేంద్ర అని తెలిపారు. ప్రేమ, యాక్షన్ సన్నివేశాలతో పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజకంగా సినిమా ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.