విశాల్‌ది అనుభవ రాహిత్యం

29 Nov, 2016 02:10 IST|Sakshi
విశాల్‌ది అనుభవ రాహిత్యం
నటుడు విశాల్ అనుభవరాహిత్యుడని రాధికా శరత్‌కుమార్ దుయ్యబట్టారు. అదే విధంగా నటుడు కార్తీ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. ఆదివారం జరిగిన దక్షిణ భారత నటీనటులు సర్వసభ్య సమావేశంలో సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్, మాజీ కార్యదర్శి రాధారవిలపై వేటు పడిన విషయం తెలిసిందే. వారి సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
 
 సంఘం తీర్మానాన్ని తప్పుపడుతూ సభ్యత్వ రద్దు వ్యవహారాన్ని శరత్‌కుమార్, రాధారవి చట్టపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. కాగా నటి రాధికా శరత్‌కుమార్ మాత్రం నటులు విశాల్, కార్తీలపై మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొంటూ నటీనటుల సంఘం ట్రస్ట్‌కు తన భర్త శ్వాశత ట్రస్టీగా ప్రకటించుకున్నట్లు నటుడు కార్తీ అన్నారనీ, అందుకు తగిన ఆధారాలను వారు చూపగలరా? అంటూ ప్రశ్నించారు. ఇక ఇరు తరుఫు చర్చలు జరపకుండా తన భర్త శరత్‌కుమార్‌ను సస్పెండ్ చేయడం కోర్టును అవమానపరచడమే అవుతుందన్నారు.
 
  ఇక సంఘ ట్రస్ట్‌కు సంబంధించిన లెక్కలు చెప్పలేదని అంటున్నారని, అరుుతే తాము ఇంతకుముందు ఇచ్చిన లెక్కల పేపర్లను ప్రేమ లేఖలుగా భావిస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు విశాల్ అనుభవరాహిత్యుడని పేర్కొన్నారు. అతడు తన బుద్ధిహీనతను ప్రదర్శించరాదని హితవు పలికారు. సంఘ సర్వసభ్య సమావేశ వేదికను అనూహ్యంగా మర్చడానికి మీకు ఏ అధికారి అనుమతిచ్చారు? ఆ వివరాలను చెప్పండి. ఒక శాశ్వత సంఘ సభ్యురాలిగా తనకు తెలియజేయాల్సిన అవసరం లేదా? అంటూ ప్రశ్నంచారు. మరి రాధిక ప్రశ్నలకు సంఘ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి.