కంటెంట్‌ ఉంటేనే ఆదరణ

16 Dec, 2018 01:02 IST|Sakshi
శైలేష్, శ్రీ రితిక

భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘రహస్యం’. శైలేష్, శ్రీ రితిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్‌ శైలేష్‌ దర్శకుడు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ హైదారాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ రాజకీయ నాయకుడు కొణిజేటి రోశయ్య పాల్గొన్నారు. సినీ ప్రముఖులు సి.కళ్యాణ్, శివశక్తి దత్తా, రాజ్‌ కందుకూరి, మానస్, శివశంకర్‌ మాస్టార్‌ తదితరులు పాల్గొన్నారు. రోశయ్య మాట్లాడుతూ– ‘‘రామసత్యనారాయణ వంద చిత్రాలకు చేరువయ్యాడు. సినిమా తీయటంతో పాటు వైవిధ్యంగా ప్రమోట్‌ చేస్తాడు.

ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. చిన్న చిత్రాల ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో ఆయన్ను చూసి నేర్చుకోవాలి’’ అన్నారు. ‘‘రామానాయుడు తర్వాత వంద చిత్రాలను నిర్మించిన వ్యక్తి రామసత్యనారాయణ. ‘రహస్యం’ చిత్రంతో తను లాభాలు చూడాలి’’ అన్నారు సి. కల్యాణ్‌. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘కంటెంట్‌ బావుంటేనే ఈ రోజు ఎంతటి స్టార్‌ సినిమా అయినా ఆడుతోంది. లేకుంటే తిరస్కరిస్తున్నారు. మాది కంటెంట్‌ ఉన్న సినిమా’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు శైలేష్‌. 

మరిన్ని వార్తలు