సిండ్రిల్లాకు ఓకే!

12 Aug, 2018 10:25 IST|Sakshi

తమిళ సినిమా: కోలీవుడ్, టాలీవుడ్‌ దాటి బాలీవుడ్‌ స్థాయికి ఎదిగిన సంచలన నటి రాయ్‌లక్ష్మి. బాలీవుడ్‌ చిత్రం జూలీ–2 ఆశించిన విజయం సాధించకపోయినా, అక్కడ తనదైన ముద్ర వేసుకున్న రాయ్‌లక్ష్మి.. చిన్న గ్యాప్‌ తరువాత కోలీవుడ్‌లో మళ్లీ బిజీ అవుతున్నారు. బాలీవుడ్‌లో యార్, నీయా 2 చిత్రాలతో పాటు మలయాళంలో నాలుగు, కన్నడంలో ఒక చిత్రం చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్‌లో మరో అవకాశం తలుపు తట్టింది. హీరోయిన్‌ సెంట్రిక్‌ పాత్రలో నటించే చాన్స్‌ను కొట్టేసింది. సిండ్రిల్లా అనే ఫాంటసీ, హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. చిన్నారుల కలల ప్రపంచంలో కనిపించే దేవకన్య లాంటి పాత్ర సిండ్రిల్లా. ఈ పేరుతో ఒక చిత్రం తెరకెక్కనుంది.

దర్శకుడు ఎస్‌జే.సూర్య శిష్యుడు వినో వెంకటేశ్‌ ఈ చిత్రం ద్వారా మెగాఫోన్‌ పడుతున్నారు. ఎస్‌ఎస్‌ఐ. ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇంతకు ముందు 100 చిత్రాలకు పైగా డిస్ట్రిబ్యూషన్‌ చేసిన ఈ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న తొలి చిత్రం సిండ్రిల్లా. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే హర్రర్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు హర్రర్‌ ఇతివృత్తంగా పలు చిత్రాలు వచ్చినా, వాటికి పూర్తి భిన్నంగా సిండ్రిల్లా చిత్రం ఉంటుందని అన్నారు.

చిత్ర టైటిల్‌ వినగానే నిర్మాత చిత్రం చేయడానికి ముందుకు వచ్చారన్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్‌ను నటి లక్ష్మీరాయ్‌కు పంపామని, ఆ తరువాత ఒక షూటింగ్‌లో ఉన్న ఆమెను లంచ్‌ బ్రేక్‌లో కలిసి కథను వినిపించామని చెప్పారు. అంతకు ముందే పంపిన సింగిల్‌లైన్‌ కథను చదివిన రాయ్‌లక్ష్మి వెంటనే నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని, చిత్ర షూటింగ్‌ కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు దర్శకుడు వినో వెంకటేశ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు