ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా?

5 Mar, 2019 13:08 IST|Sakshi

సినిమా: అంతమాత్రాన ఎలాగైనా మాట్లాడతారా? అంటూ మండిపడుతోంది నటి రాయ్‌లక్ష్మీ. ఈ అమ్మడు కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌ అంటూ పలు భాషల్లో నాయకిగా నటించింది. చివరికి అందాలారబోతకు ఏ మాత్రం పరిధులు పెట్టకుండా నటించేసింది. హిందీ  చిత్రం జూలీ–2లో హాలీవుడ్‌ తారలను మించిపోయి నటించింది. అయినా ఫలితం దక్కలేదు. ఆ చిత్రం చాలా నిరాశపరిచింది. దీంతో బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేసి మళ్లీ దక్షిణాదినే నమ్ముకుంది. ఇన్ని భాషల్లో నటించినా ఎందుకనో స్టార్‌ హీరోయిన్‌ స్టేజ్‌కు చేరలేకపోయింది.

ఇక చాలా చిత్రాల్లో సింగిల్‌ సాంగ్స్‌కు ఆడేసింది. ఇప్పుడు తమిళంలో కొన్ని చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇదిలాఉండగా ఈ సంచలన నటి గురించి వదంతులు రాని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. అలా తాజాగా ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. రాయ్‌లక్ష్మీ గర్భం దాల్చింది అన్నదే ఆ ప్రచారం. దీని గురించి ముందు పెద్దగా పట్టించుకోని రాయ్‌లక్ష్మీ ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలన్న ఉద్దేశంలో పెదవి విప్పింది. ఆమె మాట్లాడుతూ కొందరు తన గురించి వదంతులు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడింది. అవును తాను పలుమార్లు ప్రేమలో పడ్డానని  అయితే ఆ తరువాత అది బ్రేకప్‌తో ముగిసిన మాట నిజమేనని అంగీకరించింది. అలాగని తన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుని మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారా? అంటూ ఆగ్రహించింది. ఒక రోజు తాను మామిడికాయ తినడం చూశారని అంది. దీంతో వెంటనే తాను గర్భం దాల్చినట్లు ప్రచారం చేసేస్తున్నారని ఆరోపించింది. ఇలాంటివి అడ్డు కోవడానికి తాను కోర్టును ఆశ్రయిస్తానని రాయ్‌లక్ష్మీ చెప్పింది.

మరిన్ని వార్తలు