'శిల్పాశెట్టి నుంచి విడిపోలేదు'

2 Jun, 2016 20:42 IST|Sakshi
'శిల్పాశెట్టి నుంచి విడిపోలేదు'

బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శిల్పాశెట్టి. 2009లో ఆమె వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలను పక్కన పెట్టింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు వియాన్ ఉన్న విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ కు సహయజమానులు. ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడిన ఆరోపణలతో ఆ జట్టుపై రెండేళ్ల నిషేధం వేటు పడింది. అయితే ఈ మధ్య శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా అన్యోన్య దాంపత్యంలో పొరపొచ్చాలు వచ్చాయని, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు గుప్పుమంటున్నాయి.

జూహూలోని తన ఇంట్లో ప్రస్తుతం ఉండటం లేదని, శిల్పాతో కాస్త మనస్పర్థలు వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుందంటూ బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టాలని విషయాన్ని రాజ్ కుంద్రా చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఈ విషయంపై ట్వీట్ చేశాడు. ఇంట్లోనే అధిక సమయం గడపటం చాలా బెస్ట్ అని ట్వీట్ లో పేర్కొన్నాడు. తాము విడిపోవడం లేదని, తమపై వస్తున్నవి కేవలం వదంతులంటూ ఆ వార్తలను రాజ్ కుంద్రా కొట్టి పారేశాడు.