రాజ్‌ తరుణ్‌ కొత్త సినిమా ప్రారంభం

19 Jun, 2019 13:56 IST|Sakshi

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా గుండె జారి గల్లంతయ్యిందే ఫేం కొండా విజయ్‌ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై  కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు జరిగాయి.

ఈ సందర్భంగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ మాట్లాడుతూ.. ‘అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌ టైగర్‌, పంతం లాంటి సినిమాల తర్వాత మా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో చేస్తున్న మరో మంచి కథా చిత్రం ఇది. రాజ్‌ తరుణ్‌, కొండా విజయ్‌కుమార్‌ కాంబినేషన్‌లో ఇది మా బేనర్‌కి మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది’ అన్నారు.

దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ... ‘మూడు సంవత్సరాల పాటు వర్క్‌ చేసి రెడీ చేసిన అద్భుతమైన ఈ కథను రాధామోహన్‌గారు విన్న వెంటనే స్టార్ట్‌ చేద్దాం అన్నారు. రాజ్‌ తరుణ్‌కి ఇది చాలా మంచి సినిమా అవుతుంది. గుండెజారి గల్లంతయ్యిందే కంటే మంచి కథ ఇది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ రాధామోహన్‌గారి బేనర్‌లో చెయ్యడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నుండి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరుగుతోంది.

మరిన్ని వార్తలు