కార్తీక్‌వి తప్పుడు ఆరోపణలు: రాజా రవీంద్ర

22 Aug, 2019 19:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: హీరో రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నటుడు, రాజ్‌తరుణ్‌ మేనేజర్‌ రాజా రవీంద్ర తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఉద్దేశపూర్వకంగానే తనతో పాటు రాజ్‌తరుణ్‌పై కార్తీక్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వాట్సాప్‌ ద్వారా కార్తీక్‌ కొన్ని వీడియోలు పంపాడని, తనతో సంప్రదింపులు జరపాలని డిమాండ్‌ చేసినట్లు రాజా రవీంద్ర పేర్కొన్నారు. కార్తీక్‌ మొదట రూ.5 లక్షలు డిమాండ్‌ చేశాడని, ఆ తర్వాత రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని అన్నారు. కార్తీక్‌ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే తమపై ఆరోపణలు చేస్తున్నట్లు రాజా రవీంద్ర తెలిపారు. దీనిపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని ఆయన ... రాజ్తరుణ్ వీడియోలతో కార్తీక్‌ తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ గురువారం సాయంత్రం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చదవండి: రాజ్‌తరుణ్‌ కారు కేసులో కొత్త ట్విస్ట్‌

కాగా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరిలో సోమవారం రాత్రి  రాజ్‌ తరుణ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అదే సమయంలో స్థానికంగా నివాసం ఉండే కార్తీక్‌ అనే యువకుడు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.  ప్రమాదం జరిగిన వెంటనే రాజ్‌ తరుణ్‌ కారు దిగి పరుగులు పెడుతున్నట్లు... అతడిని పట్టుకోగా...తాను మద్యం సేవించినట్టు, వదిలిపెట్టమని కోరిన దృశ్యాలు బయటకు వచ్చాయి.

అయితే ఆ వీడియోలు ఇవ్వమని  రాజా రవీంద్ర తనను ఫోన్‌లో బెదిరిస్తున్నాడంటూ కార్తీక్‌ మీడియా ముందుకు వచ్చాడు. తనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అయితే ప్రమాదం జరిగి మూడు రోజులు గడిచినా.. రాజ్‌తరుణ్‌ను పోలీసులు విచారణ చేయలేదు. అంతేకాకుండా కేసు వివరాలను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెల్లడించలేదు. అయితే తాను సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం వల్లే కారు ప్రమాదం నుంచి బయటపడినట్లు రాజ్‌ తరుణ్‌ మీడియాకు ఓ మెసేజ్‌ పెట్టిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు