నా లక్కీ డేట్‌కే వస్తున్నా

17 Dec, 2019 00:32 IST|Sakshi
రాజ్‌ తరుణ్

‘‘సాధారణంగా నేను చాలా హైపర్‌. కానీ ‘ఇద్దరిలోకం ఒకటే’ సినిమాలో నా పాత్ర ఎక్కువగా మాట్లాడదు. నేను మాట్లాడే యాస కూడా ఉండదు.. సాధారణంగా మాట్లాడతాను. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అని రాజ్‌తరుణ్‌ అన్నారు. జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్, షాలినీ పాండే జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరిలోకం ఒకటే’. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్‌ కానుంది.  రాజ్‌ తరుణ్‌ పంచుకున్న విశేషాలు...
► ఓ టర్కీ సినిమా చూడమని జీఆర్‌ కృష్ణ చెబితే చూశాను. ఆ కథను మన నేటివిటీకి తగట్టు మార్చి చెప్పారు.. నాకు చాలా నచ్చింది. నేటివిటీ మార్చే ప్రయత్నంలో కొందరు కథను సరిగ్గా తయారు చేసుకోరు. కృష్ణ మాత్రం కథను బాగా తయారు చేసుకున్నారు.

► ఈ మధ్య కాలంలో నా సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ‘లవర్‌’ సినిమా తర్వాత కొంత బ్రేక్‌ తీసుకోవాలనుకున్నాను. దానికి చాలా కారణాలున్నాయి. తిరుపతి వెళ్లి జుత్తు ఇచ్చి వచ్చాను. ఈ బ్రేక్‌లో నార్త్‌ ఇండియా మొత్తం ప్రయాణించాను. ఈ ప్రయాణంలో ఫ్రెష్‌ అవడమే కాకుండా రీచార్జ్‌ అయినట్టుంది. మానసికంగానూ చాలా రిలాక్స్‌డ్‌గా అనిపించింది. గతంలో కంటే ఇకపై ఇంకా ఎక్కువగా కథపై దృష్టిపెట్టి, కష్టపడదాం అనుకున్నాను.

► షాలినీతో పని చేయడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. తన ఎనర్జీ లెవల్స్‌ సూపర్‌. ఏడవమంటే చాలు ఏడ్చేస్తుంది. చివరి అరగంట సినిమాకు చాలా కీలకం. అదే మా చిత్రానికి పెద్ద ప్లస్‌ అవుతుంది. ‘ఉయ్యాల జంపాల’ విడుదల తేదీకే వస్తున్నాం. అది నా లక్కీ డేట్‌.  

►  బ్రేక్‌ వచ్చిందని వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్‌ చేయలేదు. ప్రస్తుతం హిందీ ‘డ్రీమ్‌ గాళ్‌’ తెలుగు రీమేక్, ‘ఒరేయ్‌ బుజ్జిగా..’, అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను.

►  సినిమాలు వైఫల్యం చెందడానికి చాలా కారణాలుంటాయి. ప్రత్యేకించి ఒకటని చెప్పలేం.

►  ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. కానీ, దర్శకత్వం ఎప్పుడు చేస్తానో తెలియదు.

►  2022లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. 

>
మరిన్ని వార్తలు