నాని, సుధీర్‌లకు పోటీగా రాజ్‌ తరుణ్‌?

12 Feb, 2020 20:56 IST|Sakshi

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’.  కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఫుల్‌ అండ్‌ ఫుల్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే అదే రోజు నాని, సుధీర్‌ బాబుల ‘వి’ చిత్రం కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫ్లాఫ్‌లతో సతమతమవుతున్న రాజ్‌ తరుణ్‌ తన చిత్రాన్ని అదే తేదీన విడుదల చేస్తాడో లేదో వేచి చూడాలి. 

ఇక కెరీర్‌ ఆరంభంలో హ్యాట్రిక్‌ విజయాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌ తరుణ్‌ అ తర్వాత వరుస అపజయాలతో వెనకబడ్డాడు. ఏడాదికి రెండు మూడు చిత్రాలతో పలకరించే ఈ యంగ్‌ హీరో ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో కొండా విజయకుమార్‌ దర్శకత్వంలో యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రాన్ని చేస్తున్నారు. మాళవిక నాయర్‌తో పాటు హెబ్బా పటేల్‌ కూడా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పాత్ర చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్‌. ఇప్పటివరకు రాజ్‌ తరుణ్‌-హెబ్బాల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో వారిద్దిరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ కావడంతో ఈ చిత్రంపై కూడా అందరిలోనూ అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూబ్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నారు. 

చదవండి:
క్యాన్సర్‌ కదా... అందుకే: నటుడి భావోద్వేగం!
‘అబ్బాయిలంటే ప్లాస్టిక్‌ కప్పా?’

మరిన్ని వార్తలు