మను జర్నీ లైఫ్‌లో మరచిపోలేను

6 Sep, 2018 00:29 IST|Sakshi
రాజా గౌతమ్

‘‘బసంతి’ సినిమా తర్వాత ఆఫర్స్‌ వచ్చాయి. కానీ, నేను ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై బాగా ఫోకస్‌ పెట్టా. ఓ కొత్త తరహా సినిమాలో నేను భాగమవ్వాలనే తపన నా మనసులో బలంగా పాతుకుపోయింది. ఇవన్నీ వద్దనుకుని నాకు కావాల్సిన దాని కోసం వెతుక్కున్నాను. ఇందుకు టైమ్‌ పట్టింది. ఇకపై స్పీడ్‌ పెంచుతా’’ అని రాజా గౌతమ్‌ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్‌ సమర్పణలో క్రౌడ్‌ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. రాజా గౌతమ్‌ మాట్లాడుతూ...

► ఫణీంద్ర షార్ట్‌ఫిల్మ్స్‌ చూసి నచ్చడంతో ఫోన్‌ చేసి అభినందించా. ఆ తర్వాత కలిశాం. అప్పుడే ‘మను’ సినిమా గురించి చెప్పారు. ఇందులో నటించే వారికి మంచి పేరు వస్తుందని చెప్పా. ఫైనల్‌గా ఓ రోజు ఫోన్‌ చేసి నువ్వే హీరో అన్నారు. ఈ సినిమాతో మూడేళ్ల నుంచి ట్రావెల్‌ అవుతున్నా. డబ్బు కన్నా ఎక్కువ టైమ్‌ ఇన్వెస్ట్‌ చేద్దాం అనుకుని ‘మను’ స్టార్ట్‌ చేశాం.

► ఈ కథతో నిర్మాతలదగ్గరికి వెళితే ప్రయోగాత్మక సినిమా కదా! అన్నారు. ఫణీంద్ర ఆలోచించి ఫేస్‌బుక్‌లో క్రౌడ్‌ఫండ్‌ పోస్ట్‌ పెట్టారు. అనూహ్య స్పందన వచ్చింది. ఈ రోజు వరకూ యూనిట్‌లో ఏ ఒక్కరూ పైసా కూడా తీసుకోలేదు.

► ఈ సినిమాలో మను అనే ఆర్టిస్టు(పెయింటర్‌) క్యారెక్టర్‌లో నటించాను. ఇదొక రొమాన్స్‌ థ్రిల్లర్‌. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. సాంగ్స్‌ లేవు. పెద్దగా సీజీ వర్క్‌ లేదు. ‘మను’ జర్నీ నా లైఫ్‌లో మర్చిపోలేను. ఇదొక మంచి లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కూడా. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. 

► బ్రహ్మానందంగారి అబ్బాయి అంటే ఫస్ట్‌ సినిమా చూస్తారు. అయితే యాక్టర్‌గా నేను ప్రూవ్‌ చేసుకోవాలి.  కెరీర్‌ విషయంలో నాన్నగారు(బ్రహ్మానందం) సలహాలు ఇచ్చారు. ఇప్పటికీ వాటినే ఫాలో అవుతున్నా. తర్వాతి సినిమాకు ఇంకా కమిట్‌ కాలేదు.  హీరో పాత్రలే కాదు. నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధమే.

మరిన్ని వార్తలు