ముగిసింది. రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ముగిసింది. హిమాలయాలను సందర్శించి కూల్గా చెన్నై తిరిగొచ్చారు. అసలే ప్రశాంతంగా కనిపించే రజనీ మరింత ప్రశాంతంగా కనిపించారు. చుట్టుముట్టిన అభిమానులను చూసి, చిరునవ్వు నవ్వి మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపరంగా మీ వెనకాల ఉన్నది బీజేపీయా? అని మీడియా అడిగితే– ‘‘నా వెనకాల ఉన్నది దేవుడు, ప్రజలు’’ అన్నారు. ప్రచారంలో ఉన్నట్లుగా తన పొలిటికల్ పార్టీ పేరుని, చిహ్నాన్ని ఏప్రిల్ 14న ప్రకటించడంలేదని కూడా స్పష్టం చేశారాయన.
కాగా, రజనీ నటించిన ‘కాలా’ ఏప్రిల్ 27న విడుదల కానుంది. శంకర్ డైరెక్షన్లో చేసిన ‘2.0’ విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు చిత్రాలే కాకుండా ఈ ఏడాది రజనీ మరో చిత్రంలోనూ కనిపించే అవకాశం ఉంది. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన నటించనున్న చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.