రాజీవ్‌ కనకాల కుటుంబంలో విషాదం

3 Feb, 2018 11:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 

లక్ష్మీదేవి భర్త దేవదాస్‌ కనకాల కూడా నటుడు అన్న విషయం తెలిసిందే. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు.

లక్ష్మీదేవి గురించి... 11 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించిన ఆమె.. నాట్యకారిణిగా, నటిగా కళామతల్లికి సేవలు అందించారు. ప్రారంభంలో మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కళాకారులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు. శుభలేఖ సుధాకర్, సుహానిసి పలువురు ఆమె వద్ద శిక్షణ తీసుకున్న వారే. పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ప్రేమ బంధంలో జయప్రదకు తల్లిగా ఆమె నటించారు. ఆపై ఒకఊరికథ సినిమాలో అసోసియేట్ గా పనిచేస్తూనే ఒక చిన్నపాత్రలో నటించారు.

పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో, కొబ్బరిబోండాం సినిమాలో రాజేంద్రప్రసాద్‌ తల్లి పాత్రలో నటించారు. 1971లో నటుడు దేవదాస్‌ కనకాలను ఆమె వివాహం చేసుకున్నారు. ఆమెకు ఓ కొడుకు (రాజీవ్‌ కనకాల), కుమార్తె(శ్రీలక్ష్మి) ఉన్నారు. కోడలు కనకాల సుమ యాంకర్‌గా పాపులర్‌. అల్లుడు పెద్ది రామారావు కూడా నాటక రంగ ప్రముఖులు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు