సూపర్ స్టార్ ఇంటిని కూల్చేస్తున్నారు

28 Feb, 2016 11:34 IST|Sakshi
సూపర్ స్టార్ ఇంటిని కూల్చేస్తున్నారు

బాలీవుడ్ తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బంగ్లా ఆశీర్వాద్ను కూల్చేస్తున్నారు. రాజేష్ ఖన్నా మరణం తరువాత ఆ బంగ్లాను కొనుక్కున్న శశి కిరణ్ శెట్టి అక్కడ మరో భారీ భవంతి నిర్మించాలనే ఆలొచనతో ఈ ఐకానిక్ బంగ్లాను నేలమట్టం చేసే పనిని మొదలు పెట్టాడు. దశాబ్దాల పాటు కపూర్ల ఫాలోయింగ్కి సాక్ష్యంగా నిలిచిన ఆశ్వీరాద్ చరిత్రలో కలిసిపోతుండటం బాలీవుడ్ సినీ అభిమానులు తీవ్రంగా కలిచి వేస్తుంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా 1970లో నటుడు రాజేంద్ర కుమార్ నుంచి 3.5 లక్షలకు ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ బంగ్లాకు డింపుల్ అనే పేరుండేది. అయితే రాజేంద్ర కుమార్ అదే పేరుతో మరో బంగ్లాను నిర్మించటంతో రాజేష్ ఖన్నా స్యయంగా తన ఇంటికి ఆశీర్వాద్ అని పేరు పెట్టుకున్నారు. ఆఖరి రోజు వరకు ఖన్నా ఇదే ఇంట్లో నివాసం ఉన్నారు.

2014లో రాజేష్ ఖన్నా వారసులు ట్వింకిల్, రిన్నీలు 90 కోట్లకు ఈ ఐకానిక్ బంగ్లాను శశి కిరణ్ శెట్టికి విక్రయించారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవంతి స్థానంలో కొత్తగా అపార్ట్మెంట్ నిర్మించే ఆలోచనలో ఉన్నాడు శశి కిరణ్, ఇప్పటికే అన్ని రకాల అనుమతులు తీసుకున్న శెట్టి, ఆశీర్వాద్ను కూల్చేసే పని కూడా మొదలు పెట్టాడు.