ముంబైలో రాజేశ్ ఖన్నా విగ్రహం ఆవిష్కరణ

10 Aug, 2013 16:15 IST|Sakshi
బాలీవుడ్ సుపర్స్టార్ రాజేశ్ ఖన్నా

బాలీవుడ్ చిత్రసీమలో మకుటంలేని మహారాజుగా వెలుగులు విరజిమ్మిన సుపర్స్టార్ రాజేశ్ ఖన్నా ధైర్యానికి ప్రతీక అని ఆయన మాజీ భార్య డింపుల్ కపాడియా పేర్కొన్నారు. ఆయన ఆనంద్ చిత్రంలో నటించడమే కాకుండా ఆనంద్లా జీవించారని తెలిపారు. మరణం సమీపించిన తరుణంలో కూడా రాజేశ్ ఖన్నా తన ముఖాన చిరునవ్వు చెక్కుచెదరలేదని ఆమె గుర్తు చేసుకున్నారు.

 

రాజేశ్ ఖన్నా విగ్రహాన్ని ముంబై నగరంలోని బాంద్రా విధిలో శనివారం ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ఆయన
కుటుంబ సభ్యులు డింపుల్ కపాడియా, కూతుళ్లు ట్వింకిల్ ఖన్న అల్లుడు అక్షయ్ కుమార్లు హాజరయ్యారు. చేతిలో బెలూన్లు పట్టుకున్నట్లు ఉన్న రాజేష్ ఖన్న విగ్రహాం చూస్తేంటే ఆనందంగా ఉందని అక్షయకుమార్ తెలిపారు. రాజేష్ ఖన్నా (కాకాజీ)కి ఆ అరుదైన గౌరవం లభించినందుకు ట్వింకిల్ ఖన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

 

రాజేశ్ ఖన్నా తనుకు మంచి స్నేహితుడని అందాల నటి హేమమాలిని తెలిపారు. అలాగే ఆయనతోకలసి నటించడం ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని చెప్పారు. రాజేశ్ ఖన్నాతో కలసి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంగతిని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు ఆశా ఫరేఖ్, మిధున్ చక్రవర్తి  రాకేష్ రోషన్, ఫరాహ్ అక్తర్, జితేంద్ర, జోయ అఖ్తర్, రణదీర్ కపూర్, రిషి కపూర్, జాకీ షరాఫ్, హేమమాలి తదితరులతోపాటు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో  హాజరయ్యారు. 2012 జూలై 18న రాజేశ్ ఖన్నా తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.