చిట్టి రిటర్న్స్..!

4 Sep, 2015 23:32 IST|Sakshi
చిట్టి రిటర్న్స్..!

 దర్శకుడు శంకర్ తన చిట్టి ‘రోబో’ను మళ్లీ  తెర మీద చూపించడానికి రెడీ అవుతున్నారు. అయిదేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘రోబో’ భారతీయ సినీ చరిత్రలో సెల్యులాయిడ్ వండర్‌గా నిలిచిపోయింది. ఇప్పుడీ చిత్రానికి శంకర్ సీక్వెల్ రూపొందించనున్నారు. శంకర్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేశారు. ఈలోగా ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇందులో రజనీకాంత్ హీరో అని, విక్రమ్ విలన్ అని, కత్రినా కైఫ్ కథానాయిక అని చాలా వార్తలు షికారు చేస్తున్నాయి.
 
 కానీ శంకర్ మాత్రం ఈ వార్తలకు స్పందించడంలేదు. ఆ మధ్య విక్రమ్‌తో చేసిన ‘ఐ’ సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వకపోవడంతో ‘రోబో’ సీక్వెల్‌ను ఎలాగైనా అద్భుతంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో ఉన్నారట శంకర్. మొదటి భాగానికి మించిన గ్రాఫిక్స్‌తో ఏకంగా  300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ‘అంతకు మించి’ అనే రీతిలో ఈ‘రోబో’ సీక్వెల్ చేయనున్నారని సమాచారం. ‘ఉత్తమ విలన్’, ‘నేను దేవుణ్ణి’,  ‘కడలి’ సినిమాలకు స్క్రిప్ట్ అందించిన  రచయిత జయమోహన్‌కు ఈ సీక్వెల్ స్క్రిప్ట్ బాధ్యతలు అప్పగించారు.
 
  ‘‘ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ నటించనున్న మాట నిజమే. అయితే మిగతా పాత్రలకు ఇంకా ఎవర్నీ ఎంపిక చేయలేదు. ప్రస్తుతం రంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న రజనీకాంత్, ఆ సినిమా షూటింగ్ పూర్తవగానే ‘రోబో’ సీక్వెల్ చిత్రీకరణలో పాల్గొంటారు. స్క్రిప్ట్ వర్క్ ఇటీవలే పూర్తయ్యింది’’ అని జయమోహన్ ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో చెప్పారు.
 

>